Posts

మిలిట్రీ కృష్ణ మూర్తి - మాండలిక కథ

వొదినా అండ bidlu- మాండలిక కథ

సంపూర్ణక్క- తవుసు మాను - కథ          సూర్యోదయానికి ఇంకా మూడు గంటల సమయముండాది. సలిగాడు గిలిగింతలు పెడతా వుండాడు .         'సలికి బయపడితే పనులు గావులే ' అనుకొని కప్పు కున్ని బొంతని పక్కకు నెట్టి కుడి పక్కకు తిరిగి లేసి కూసునింది సంపూర్ణక్క. దండం బెట్టుకోని  బర బరా అరిసేతులు రుద్దుకొని మొగం సూసుకొనింది.         సలి గజ గజలాడిస్తా వుంటే కొంగును తల సుట్టూ సెవుల  మీందగా తీసు కొచ్చి జారి పోకుండా గొంతు కింద ముడేసుకొనింది. ఇంటి ముందర, రచ్చ బండ మింద, దాని కింద సుట్టూ పరా పరా పుల్లల పొరకతో  చెత్త తోసి కళ్లాపి సల్లింది.         స్జులుక్కు స్జులుక్కు అంటా ఒచ్చే  కళ్లాపి శబ్దాన్ని ఇని  మెలకువొచ్చినా కూడా తోడి కోడలు వసంత కొంచిం పాలుమారి ఎంటనే లేసిరాలా         ' పోనీలే ఇంకొంచేపు పండుకోనీ . ఈ లోపల యాప సెట్టు కాడ నీళ్లు సల్లేసొస్తా'  అనుకోని బయలు దేరింది సంపూర్ణక్క.         ఎడమ సేతిలో పొరక్కట్ట, సంకలో నీళ్ల కడవ , కుడిసేతిలో పేండకళ్లేసిన బొక్కినీ పట్టుకొని బోయి రోడ్డు పక్కన సలాబండ్ల కాడండే రాగి మాను యాప్మాను సుట్టూ శుద్ది జేసి ముగ్గు కర్ర ఏసేసొచ్చింది.         సేంద బాయిలో నీల్లు సేందుకోని రావాలంటే ఇద్దురుండాల. ఒకరు సేంది పొస్తే ఒకరు ఇంట్లో పోసి రావడానికి . ఒగటా, రొండా ఒగిరవై గడవల నీళ్లు కావాల కదా ఇంటికి.         'ఐదు దాటిందంటే జనం ఎక్కువుంటారు బాయి సుట్టూ గిజ గిజా. రాట్నం దొరికేదట్ల పక్కన పెడ్తే  వొంగి చేందుకొనేందుకు కూడా తావు దొరకదు. ' అనుకుంటా ఇంటికాడికొచ్చింది.         వసంత లేసినట్లుండాది. ముగ్గు మింద గొబ్బెమ్మలు పెట్టుండాయి. కడవలు , చేంతాడు , బొక్కిని బయటబెట్టుండాయి. సలికి కప్పడం దెచ్చుకోడానికి  పొయ్యినట్లుంది. తువ్వాలు తలకు సుట్టు కుంటా వొచ్చింది, ' లేపుండకూడదాకా ' అంటా .         ఇద్దురూ సేందబాయి కాడికి బొయినారు. సర సరా సంపూర్ణక్క సేంది పోస్తా వుంటే వసంత తలమిందొకటి సంకలో ఒకటి పెట్టుకోని తొట్లలోకి ఎద్దల కుడితిలోకే కాకుండా పూల చెట్లకు కూడా తంపుగా పోసి 'ఇంగ సాలు పోదాం పదకా ' అని వచ్చింది         'ఇరపాచ్చమ్మ గుడికాడికి పొయ్యొచ్చెయిపో కా . ఇంట్లో పని నేను సూస్తా' అనింది ఇంటికొచ్చి కడవలు దించి పెట్టినాక వసంత.         ఆ సల్లోనే సంపూర్నక్క రొండు సెంబులు సన్నీళ్లు నెత్తిన గుమ్మరించుకోని కాయా కర్పూరం, పూలు దీసుకొని ఇరపాచ్చమ్మ గుడికి బయలుదేరింది.         వూరికి దూరంగా వరి మళ్ల మద్దిలో వుంటాది ఆ గుడి. గెనాల మింద నడిచి పోవాల. పొట్ట కర్రతో వుండే వరి పైరు లోను, గెనాల  మింద వుండే కసువు లోను మంచు నిండుకోని మోకాళ్లదాకా సీరను ముద్దజేసేసింది. తడి తల్లో నీళ్లు గారి ఈపంతా ముద్ద. ఊరి బయట కావడం వల్ల సెట్లలో నించి ఒచ్చే చల్లని గాలికూడా గడ గడ వొణికించేస్తా ఉండాది.         గుడి ముందర చెత్త తోసి ,  ముగ్గులు పెట్టి పూజ చేసి హారతిచ్చి బెల్లం నైవేద్యం పెట్టింది. రేక్కాయంత  బెల్లాన్ని కండ్ల కద్దుకోని నొట్లో కేసు కునింది. ఆన్నించి బొయ్యి కాటమ రాయుని గుండుకు మొక్కోని. సెరువు కట్టకెగుదల వుండే మామిడి  తోపులోకి దూరింది.         ఆ చెట్ల మద్దిలో గుడి గోపురం మాదిరిగా ఉందొక పాము పుట్ట. ఆ పుట్ట మింద పసుపు నీళ్లు సల్లి  కుంకుం బొట్లు  పెట్టింది.  తెచ్చిన పత్తి వస్రాలను ఆడాడా పుట్టమింద పెట్టి బకితితో చేతులు జోడించింది.         కళ్లలో నీళ్లు కమ్ముకోనొస్తా ఉండాయి.  ' అమ్మా నాగాలమ్మా. నీ బిడ్లిమి తల్లీ. నువ్వే కనికరం సూపించక పొతే  ఇంగ మేము ఏ ఏట్లో  దూంకి సావాల. నాకు నాగదోస ముండాదని అందుకే పిలకాయిలు పుట్టలేదని అంటా వుండారు. నేను సెయ్యని పూజలుండాయా? నిన్ను కొలవని దినముండాదా? మిమ్మల్నందురినీ మొక్కందే పచ్చి మంచి నీళ్లు గూడా ముట్టుకోనే .ఎన్నాళ్లకమ్మా నీ దయ ' అని జల జల కన్నీరు కార్సింది.         ఒక సిటికి  పుట్టమొన్ను గిల్లుకోని నోట్లో ఏసుకోని సప్పరించి ఇంటి మొగం బట్టింది.         రొండు దినాలైనాక ఆ పొద్దు సుక్కరారం. మొగున్ని  బలమంతంగా బయలుదేర దీసింది. పొన్న దేవలానికి బొయ్యి ఉయ్యాల గట్టి రావాలని . ఏడాది వొయుసు మర్ది కొడుక్కు. వాన్ని ఈయమ్మే ఎత్తుకోని సాకతా వుండాది . వాన్ని కూడా పిల్సుకునింది.         ' వాడెందుక్కా తోక, మీరు పొయి రాకుండా ' అనింది వసంత.         ' రానీ  వాడు లేకపోతే నాకు బాగుండదు. వాడూనేను లేక పోతే నిన్ను సతాయిస్తాడు.' అనింది.         వాన్ని చూసుకుంటా పని సేసుకోడం తలకుమించిన పనని తెలుసామికి .          వాళ్లత్త కూడాలేదింట్లో . ఆయమ్మ కూతురికి రొండో కానుపు  సేసిరాను సామి రెడ్డి పల్లికి  పొయ్యుండాది.         ' అక్క కడుపులో ఒక కాయి కాస్తే  వాళ్లూ  సంతోసంగా ఉంటారు కదా 'అని అనుకునింది వసంత. వాళ్లు  పొన్నకు బయలుదేరతా ఉంటే.         సంపూర్ణక్క , మొగుడు మునిరత్నమన్న బస్సు కోసం రోడ్లో సలా బండ్ల మింద కూసోనుండారు. ఆయన్న  తమ్ముడు యాప్పుల్లతో పండ్లు తీటుకుంటా సెరువుకింద బాయికాణ్నించి వచ్చినాడు.          ' మంత్రాలకు సింతకాయిలు రాలవు నా , డాక్టర్లకు సూపించుకోండి అంటే ఇనరు కదా! ' అన్న్యాడు  అన్నను సూస్తా.         'సుబం పలకరా సుబ్బన్నా అంటే , పెండ్లి కూతురు ముండేడ అన్న్యాడంటా ఎనకటి కెవుడో . బయలుదేరి పొతా వుంటే ఇట్ల అనొచ్చా' అనుకోని దిగులు మొగం బెట్టుకునింది సంపూర్ణక్క.          ' డాకటర్లు మాత్రం ఏంజేసినార్రా. సూపిస్తానే  ఉండాము గదా! 'అన్న్యాడు అన్న. తమ్ముడు మారు బలక్కుండా ఇంటికి బొయినాడు.         పొన్న దేవలంలో పూజ సేసుకొని రాగిమానుకు ఉయ్యాల గట్టినాక పూజారి కాళ్లకు దండం బెట్టు కోని సమస్యను ఇన్నవించు కున్న్యారు దంపతులు.         ' గుల్లో ఉండే అంగిట్లో తెల్ల జిల్లేడు ఏరుతో సెక్కిన ఇనాయకుని బొమ్మ అమ్మతారు. దాన్ని దీసుకోని బొయ్యి దేవుని గూట్లో బెట్టి మండలం దినాలు ఎర్రంగా వుండే పూలు పెట్టి పూజ జేసుకోమ్మా' అన్న్యాడు పూజారి.         ఇంటికొచ్చినాక అన్ని పూజలతో పాటు ఇదీ ఇసుగూ ఇరామం లేకుండా సేసింది సంపూర్ణక్క.         ఎండా కాలమొచ్చింది . ఇస్కూల్లకి లీవులిచ్చేసినారు.         ' ఏప్రిలు ఇరవయ్యో తేది నుంచి బార్తం గుడికాడ పొగులు కత మొదులవుతాది . కంగుంది  కుప్పం నించి పొగులు కత సెప్పే  బాగవతార్ అయ్యోరు వచ్చుండాడహో ' అని తోటోడు సాటింపు ఏసి పొయినాడు.         ఊర్లో ఎవురి నొట్లో సూసినా  బార్తం గురించే. ఏడూర్లలో చందాలు  కూడా వసూలు సేసేసినారు. పొగులు కత సెప్పే  అయివోరు, ఆయిన బార్య,   పక్క వాద్యగాల్లిద్దురూ వొచ్చి ముత్తర పల్లి అన్నా సామింట్లో  దిగిపొయినారంట అనే వర్తమానం అందురుకీ తెలిసింది. పిల్లా పెద్దా అందురూ శానా కుశాలగా ఉండారు.         మద్యానాని కంతా పనులు ముగించుకోని జట్లుజట్లుగా గలాం బులాం అని మాట్లడుకుంటా పగులు కతకు పొయ్యి వస్తా వుండారంతా. అయివోరు కత శానా బాగా సెప్తావుండాడని అందురూ సెప్పుకున్న్యారు.         వారం తర్వాత తోటోడు మల్లీ ఒక టముకేసి పొయినాడు. ' తమిల్ నాడు నుండి ఈ పొద్దు రెయ్యాట ఆడే వాళ్లు దిగతా  వుండారు. రేపట్నించి రెయ్యాట కూడా వుండాది. అందురూ రావాల్సిందహో ! ' అని.         రెయ్యాటాడే వాళ్లొచ్చిన రొండో  దినమే ద్రవుపదమ్మ పెండ్లి జరిగింది. విగ్రహాలను దీసుకొని మూడు దినాలు ఏడూర్ల లోను  మెరివిణి సేసినారు. శానా మంది వాళ్ల ఇండ్ల ముందు కొచ్చినప్పుడు ద్రవుపదమ్మకు ఒడిబాలు గట్టి మొక్కు సెల్లించు కున్న్యారు.         మర్స నాడే  అర్జునుడు తవుసు మానెక్కతాడని మళ్లీ సాటింపు.         ఎప్పుటి మాదిరిగానే ఎంతో పొడుగ్గా ఉండే తాటి మాను కొట్టుకోనొచ్చి దాని తల కొట్టెసి మాను పొడుక్కూ మెట్లు అమర్చి గుడిముందర నాటినారు. పైన అర్జునుడు కుచ్చునేందుకు పీట దానిమింద ఎండబడకుండా గూడు కట్టినారు.         తెల్లారి పదికంతా బార్తం గుడికాడ ఇసికేస్తే కింద రాలనంత  జనం సేరి పొయినారు. అర్జునుడి ఏసంతో వున్నాయిన పూజా సామాగ్రి వున్న జోలిని బుజానేసుకోనొచ్చి నిలబడినాడు.         పొగులు కత సెప్పే అయివోరొచ్చి 'వర పడే ఆండోల్లంతా పొయ్యి బాయికాడ నీళ్లలో మునిగి రాండమ్మా ' అని సెప్పినాడు.         వర పడే ఓల్లలో సంపూర్ణక్క కూడా వుండాది. ఇది అయిదో సమత్సరం ఆ యక్క వరపడతా వుండేది. అందురు తడి బట్టలతో ఒచ్చి సుట్టూ నిల్సుకున్న్యారు.         వసంత ఒచ్చి సంపూర్నక్కతో ' పడమటి పక్క నంటా పండుకో , అపక్కకు గాలి గొడ్తుందంటా అయివోరు సెప్తా వుంటే ఇంట్ని ' అని సంపూర్ణక్కను ఎచ్చరించి పోయింది.         పూజ మొదులయింది. పొగులు కత సెప్పే అయివోరు పద్యాలు స్లోకాలు సెప్పి తవుసుమానుకు పూజ సేసి కతను సెప్తా  'అర్జునుడు పాసుపదాస్త్రం కోసం తబుసు సెయ్యిను వచ్చినాడు.' అని ముగించినాడు.         అర్జునుని ఏసమేసుకోనొచ్చినాయిన శివుని పాట పాడతా తవుసు మానుకు మూడుసార్లు ప్రదచ్చిన సేసుకోని ఒక్క మెట్టెక్కి నాడు. '         ఓ 'అని అరుపులు, ఈలలు,  , చప్పట్లు మిన్ను ముట్టినాయి . పాట ఇనిపించాలంటే అర్సకుండా  ఉండాలని ఆడుండే బండ మిందికి ఎక్కోని ఒకాయిన ఎచ్చరించినాక కొంచేపిటికి సద్దు మనిగింది.         శివుని పాట  పాడతా అర్జునుడు రెండో మెట్టెక్కి కూచ్చున్న్యాడు. అట్లా పజ్జెనిమిది మెట్లెక్కి నాడు. మెట్టు మెట్టుకూ ఒక పాట. ఆయన పాడిన పాటల్లో ... నీలకందరా దేవా, జగదీస్వరా పాహీ పరమేశ్వరా , దేవ దేవ దవలాచర మందిర అనే సినిమా పాటలు కూడా వుండాయి. ఆయన గొంతు శానా బాగుండాది.         పైన పీట  మింద కూచున్నాక  పూజ మొదులు బెట్టినాడు. వర పడినోల్లంతా సేతులు ముందుకు సాచుకోని తవుసు మాను సుట్టూ బోర్లా పండుకున్న్యారు. సంపూర్ణక్క వసంత సెప్పినట్లుగానే పడమటి దిక్కున పండుకొనింది.         కాయగొట్టి కర్పూర మెలిగించి హారతిచ్చినంక జోలెలో వుండే బొరుగులు, నిమ్మ పండ్లు, ఆకులు , వక్కలు, పసుపు కొమ్ములు , పూలూ, అంటిపండ్లు, ఇబూది పండ్లు అన్నీ సుట్టూ వరపడిన వాళ్ళ సేతుల్లో పడేట్లగా కిందికి సల్లి నాడు పైనుండే అర్జునుడు .         గాల్లో అవి కిందికొస్తా ఉంటే సుట్టూ ఉండే జనాలు వాటిని పట్టు కొనే ప్రయత్నం ముమ్మరంగా సేసినారు. వర పడిన వాళ్ల సేతుల్లో పడిన వాటిని సూసుకొని కొందురు వాళ్ల వాళ్లతో మురిసి పోతా వుంటే , పడని వాళ్లు ఉసూరుమని నిలబడి వుండారు         అర్జునుడు కిందికి దిగొచ్చే పాటికి శివుడు ఏటగాని  యాసం  , పార్వతి చెంచీత  యాసంగా  ఏసుకున్నోళ్లొచ్చినారు. పెద్ద పంది బొమ్మ ఉంటే అర్జునుడు , ఏటగాడూ ఇద్దురూ బాణాలేసి  పంది నాదంటే నాదని కొట్లాడుకున్న్యారు. చివరికి ఏటగాడు  శివునిగా మారి అర్జునునికి పాసుపతాస్త్రమిచ్చినాడు.         ఎప్పుడూ లేంది ఈ సారి సంపూర్ణక్క  సేతిలో  అంటిపండు పడింది. సంతోసం పట్టలేక నేరుగా పొయ్యి. పగలుకతయివోరికి సూపించి కాళ్లకు మొక్కింది.         ' అంటి పండు పడింది గదమ్మా నీ సేతిలో  . తప్పకుండా నీకు ఆడ సంతు కలగతాది తల్లీ . రేత్రి పొండుకొనే ముందు ఆ పరమాత్రుని తల్సుకోని పండు దిని పండుకోమ్మా '  అని దీవించినాడు.         సంపూర్ణక్క కొంగు ముడి ఇప్పి అర్ద రూపాయి దుడ్లు అయివోరి సేతిలో బెట్టి ఆయన కాళ్లకు మొక్కి కళ్లకద్దుకొనింది. అంతా సంతోసంగా ఇల్లు సేరినారు. ఇది జరిగి రొండు యేండ్లు గడిసి పోయా .బార్తం మొదులు కావడానికి ఇంగో రొండు నెలలుండాది.         సంపూర్ణక్క ఇంగా దినామూ  బ్రహ్మ  మూహూర్తంలో లేసి పూజలు సేస్తానే ఉండాది  . నెలకు రొండు సార్లు అమాసకు, పున్నమికి  పుట్టకు పాలు పోస్తానే ఉండాది . ఇరపాచ్చమ్మకు, కాటమ రాయునికీ బకితితో పూజలు సేస్తానే ఉండాది. కనిపించిన గుళ్లలో ఉండే దేముళ్లకు ముడుపులు కడతానే ఉండాది. అప్పుడప్పుడూ వ్రతాలు, నోములూ నోసి ముత్తైదులకు పసుపుకుంకాలిచ్చి అచ్చింతలు సేతిలో పెట్టి కాళ్లకు మొక్కోని దీవెనలందుకోవడం తప్పించ లేదు. దాన దర్మాలు కూడా దండిగా సేస్తా ఉండాది. బార్తం గుడికాడ తవుసు- తవుసుమాను - కథ